Telangana: దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు మనం అండగా ఉంటూ, వారందరూ సుఖంగా ఉండేలా చర్యలు తీసుకుంటే మన సమాజం, దేశం సుభిక్షంగా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. రైతులకు తోడుగా ఉంటూ మనం చేయిచేయి కలుపుతూ, వారికి సహాయ సహకారాలు అందిస్తే వ్యవసాయం పండుగలా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో భాగంగా రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడంతో రాష్ట్రంలో అన్నదాతలు ఆనందంగా ఉండడమే కాకుండా వ్యవసాయం దండుగ కాదు, ఒక పండుగ అనే వాతావరణం నెలకొనడం మంచి పరిణామం.
ప్రస్తుతం మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితుల్లో అన్ని రంగాల వలే వ్యవసాయం కూడా భారీఖర్చుతో కూడుకోవడంతో పంట వేసేందుకు రైతులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నా సాగుకు సరిపోని పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కష్టమనే నిరాశ నిస్పృహలకు లోనవుతున్న రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి కింద సాయపడేలా ప్రభుత్వం నగదు అందజేస్తుండడంతో అన్నదాతలు పొలం బాట పడుతున్నారు. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ‘రైతు బంధు’తో ప్రారంభమైన పెట్టుబడి సాయం పరంపర ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘రైతు భరోసా’గా కొనసాగుతుంది. సర్కార్లు మారినా, ప్రభుత్వ విధానాలు మారినా రైతులకు పెట్టుబడిగా సాయం అందండం ఆనందదాయకం. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో నిమత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా కొనసాగించడం శుభపరిణామం.
ఆర్థిక భారమైనా రైతులకు ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే ప్రతిష్టాత్మకమైన రైతు రుణ మాఫీ, సన్నాలకు బోనస్ పథకాలను అమలు చేసి, ఇప్పుడు రైతు భరోసా కూడా అందించింది. రైతు భరోసా పథకంపై లోతైన అధ్యయనం చేసిన ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి ఒత్తిడిలకు లొంగకుండా ప్రజాధనం పక్కదారి పట్టకుండా కీలక చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకానికి సంబంధించి జీవో నెంబరు 231 జారీ చేసినా, అది కట్టుదిట్టంగా అమలు చేయకుండా సాగుచేయని భూములకు కూడా నగదు చెల్లించడంతో 21 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ఖజానా దుర్వినియోగమైందనే వార్తలున్నాయి. బడా భూ యజమానులకు చెందిన సాగులేని భూములకు, మైనింగ్ భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు, వ్యవసాయ యోగ్యతా లేని భూములకు కూడా రైతు బంధులో నగదు చెల్లించడంతో ప్రజాధనం నిరుపయోగమైందనే విమర్శలు వెలువెత్తాయి.
ఈ నేపథ్యంలో రైతు బంధులో జరిగిన లోటుపాట్లను సరిచేస్తూ రైతు భరోసాను అందించాలనే లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం భారీగా దిద్దుబాటు చర్యలు తీసుకుంది. రైతు భరోసా పథకం విధివిధానాలను రూపొందించడానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు సమావేశాలు నిర్వహించి, అన్ని వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించారు. వీటిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పకడ్బందీగా అమలు చేయడంతో రైతు భరోసా విజయవంతమైంది. వ్యవసాయ యోగ్యతా భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించడంతో ప్రజాధనం సద్వినియోగమైంది.
తెలంగాణలో అమలు చేసిన రైతు బంధు, రైతు భరోసా పథకాల మధ్య వ్యత్యాసాల్లో కీలకమైంది నగదు పెంపు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.10 వేలు చెల్లిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల రూపాయలు పెంచి రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు చెల్లించింది. రైతు భరోసా పథకం అమలులో తెలంగాణ రికార్డు సృష్టించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ పథకం కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.8744.13 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టం. రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న పథకాలకు సంబంధించి గత 10 సంవత్సరాల వివరాలను సమీక్షిస్తే 2025 జూన్లో విడుదల చేసిన రైతు భరోసాలో పలు రికార్డులున్నాయి. రైతు బంధు ప్రారంభంలో 2018లో 128 రోజుల్లో రూ.5237 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేయగా, ఇప్పుడు రైతు భరోసా ప్రారంభంలో 2025 జూన్లో తొమ్మిది రోజుల అత్యల్ప కాలంలో రూ.8 వేల కోట్లకుగా అత్యధిక నగదును చెల్లించినట్లయ్యింది. గతంలో 2020 జూన్లో రైతు బంధు చెల్లించడానికి అత్యధికంగా 169 రోజులు తీసుకొని రూ.7,288.70 కోట్లు చెల్లిస్తే, ఇప్పుడు రైతు భరోసా ఆ రికార్డులన్నింటినీ తిరగరాసింది. 1 నుండి 15 ఎకరాలకుపైగా వ్యవసాయ భూములున్న 69.40 లక్షల మంది రైతులకు చెందిన 145.73 లక్షల ఎకరాలకు రూ.8744.13 కోట్లను వారి ఖతాల్లో జమచేయడం వ్యవసాయం రంగంలో కొత్త రికార్డు. భూములున్న యజమాన రైతులకే కాకుండా భూముల్లేని రైతులకు కూడా భరోసా కల్పించేలా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ప్రభుత్వం వారికి ఏడాదికి రూ.12 వేలు చెల్తిస్తూ, దేశంలో రైతు కూలీలకు సాయం అందించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతు భరోసా కంటే ముందుగానే మరో ఆర్థిక భారమైన రైతు రుణ మాఫీ పథకాన్ని పూర్తి చేసింది. అన్నదాతలకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 25 లక్షల మందికిపైగా రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు. అంతేకాక రాష్ట్రంలో వరి సాగును ముఖ్యంగా సన్నాలను పెంచేందుకు రైతులకు ప్రోత్సాహకరంగా మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ కూడా చెల్లించడంతో రైతులు సన్న వరిని పెద్ద ఎత్తున సాగుచేశారు. వరి బోనస్ కింద తెలంగాణ రైతులు రూ.1199 కోట్లు లబ్ది పొందారు. రూ.29,562 కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రభుత్వం ప్రోత్సాహంతో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో 275 లక్షల టన్నులకు చేరింది. 2024`25లో 183.57 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా బియ్యం పండిరచిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
రైతు సంక్షేమంలో భాగంగా రైతు బీమా పథకాన్ని 42.16 లక్షల మంది రైతులకు ప్రభుత్వం బీమా అందించింది. ఇందిరా గిరి వికాసం పథకం కింద 2.1 లక్షల గిరిజన రైతులకు సోలార్ విద్యుత్తో కూడిన పంపుసెట్లు, స్ప్రింకర్లు, డ్రిప్పు వంటి రూ.282 కోట్ల విలువగల పరికరాలను 40 వేలకు పైగా రైతులకు అందించారు. వెదురు, అవకాడో, అయిల్పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో గెలల ధర టన్నుకు రూ.12,534 ఉండగా ప్రభుత్వ చొరవతో ఇప్పుడు రూ.18,748కి పెరిగింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ 2004లో ప్రవేశపెట్టిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తుండడంతో అన్నదాతలకు గొప్ప ఉపశమనం కలుగుతోంది. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో భాగంగా ప్రభుత్వం నెలకి రూ.900 కోట్ల చొప్పున రూ.17901 వేల కోట్లను రైతుల పక్షాన చెల్లిస్తోంది. చివరి పంట వరకు సాగునీటి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. పెండిరగ్లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తూ, అవసరమైన వాటికి మరమ్మతులు పూర్తి చేస్తూ, వ్యవసాయానికి నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంది.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్తో భూ యజమానులు అనేక సమస్యలు ఎదుర్కొన్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి ప్రవేశపెట్టడంతో అన్నదాతలకు మేలు జరిగింది. తెలంగాణలో అకాల వర్షాలతో గతంలో జరిగిన నష్టంపై కేంద్రం సకాలంలో స్పందించకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని అన్నదాతలను ఆదుకుంది. 2025 మార్చి, ఏప్రిల్లో సుమారు 6 వేల ఎకరాల్లో పంట నష్టం జరగగా కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందిచకపోయినా రాష్ట్ర ప్రభుత్వం 40 వేల మందికిపైగా రైతులను ఆదుకుంటూ రూ.51 కోట్లకు పైగా రైతుల ఖతాల్లో జమ చేసి ఆదుకుంది.
ప్రభుత్వం అందిస్తున్న వ్యవ‘సాయం’ రైతుల్లో భరోసా కలిగించి రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగు పెరగాలని, అన్నదాతలకు అండగా నిలిచేలా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.