9.2 C
London
Wednesday, January 15, 2025
HomeLatestBJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?

BJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?

Date:

Related stories

literature: కులం అనే ఆలోచనకు ప్రేమే పరిష్కారం..!

విశి: కుట్టి రేవతి తమిళ కవయిత్రి & సినీ గీతరచయిత్రి. అసలు పేరు...

sankranti2025: 3 డీ టైప్స్ ముగ్గులు..ప్రత్యేకం..!

సాహితీ, ప్రసిద్ధ, మౌక్తిక: ...

literature: ఎరుకే జ్ఞానం నీవే దైవం..!

Teluguliterature: ఆ.వె : శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మముండుట...

vaikuntaekadashi: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత..!

Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం...

literature: మన తెలుగు – మన వెలుగు.. పద్య నిర్మాణ కౌశలం..!

Teluguliterature: శా : ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం చిద్ర్దోహంబును నీకుఁజేయరు, బలోత్సేకంబుతోఁ...
spot_imgspot_img

BJP:

బీజేపీ మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల కిందటే (1967) ఒక చరిత్రాత్మక సందేశాన్నిచ్చింది. ‘పార్టీలో కొత్తవారి చేరిక, ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం వంటివి జరిగినపుడు…. పార్టీలో కొత్తగా చేరే వారు, పాత నాయకుల మధ్య ఓ సంఘర్షణ, సమస్యలు తలెత్తడం ఉంటుంది. దాన్ని సంయమనంతో అధిగమించాలి’ అని నిర్ణయించింది. అదే సందర్భంలో పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ మాట్లాడుతూ, ‘అస్పృశ్యత నేరం, రాజకీయ అస్పృశ్యత అతిపెద్ద నేరం’ అన్నారు. ‘అటువంటి కలయికలు తప్పదు, అప్పుడు అందరూ కలిసి పనిచేయాల్సిందే’ అని వివరణాత్మకంగా ఆయన ఉద్బోధించారు. కొంచెం సర్దుబాట్లతోనయినా.. ఇదే విధానాన్ని పార్టీ నాయకత్వం ఇప్పటికీ దేశవ్యాప్తంగా అనుసరిస్తోంది. కానీ, ఆ విషయంలో వివాదమే తెలంగాణ బీజేపీ విస్తరణలో తీవ్ర ప్రతిష్టంభనకు కారణమవుతోంది. ఈ సమస్యను అధిగమించలేక పార్టీ ఢిల్లీ నాయకత్వం అయోమయానికి గురవుతూ, తలపట్టుకుంటోంది. సమస్యలు సరే… పరిష్కారాలు కావాలి!

తెలంగాణలో బీజేపీ పరిస్థితి బయటివారికే కాక అంతర్గతంగా పార్టీ శ్రేణులకూ విస్మయం కలిగిస్తోంది. ఎదిగే అవకాశం ఉండీ, విస్తరణలో వీడని ప్రతిష్టంభన ఏర్పడింది. ఓ పట్టాన తొలగటం లేదు. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్ష నియామకమే జరగట్లేదు. సంస్థాగత ఎన్నికలకు దాన్ని ముడిపెట్టి ప్రస్తుతానికి సరిపెట్టారు. పాత-కొత్త నాయకుల మధ్య ఘర్షణ వైఖరితో…. రాష్ట్రంలో సంస్థాగత ఎదుగుదల ఒకడుగు ముందుకి రెండడుగులు వెనక్కి పడుతోంది. బీజేపీ ఎదుగుదలను వేరెవరో కాదు, పార్టీ సొంత నాయకత్వమే అడ్డుకుంటున్నట్టుందని వారి హితైషులు, శ్రేయోభిలాషులే సనుక్కుంటున్నారు. పార్టీ ఢిల్లీ నాయకత్వపు ద్వైదీభావం కూడా పార్టీశ్రేణుల్నే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకే విషయంలో రెండు విధాలుగా… అంటే, ఒకసారి ఒకలా, మరోసారి ఇంకోలా వ్యవహరించడం వెనుక లాజిక్కేమిటో ఎవరికీ అంతుబట్టడంలేదు. పాత -కొత్త నాయకుల మధ్య సయోధ్య కుదుర్చకుండా, మరో పక్క…. పార్టీ నేతలతో ఏ సంప్రదింపులు లేకుండా, మాట మాత్రంగానైనా చెప్పకుండా కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న తీరు వింతగా ఉంటోంది. లాంఛనంగా పార్టీలోకైనా రాకముందే బయటి వారికి పదవులు కట్టబెట్టడం చూస్తుంటే… ఢిల్లీ స్థానిక నాయకత్వం మధ్య సయోధ్య ఎంత గొప్పగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. తెలంగాణ బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ (రాజ్యసభ) స్థానం కట్టబెట్టడంలో అదే జరిగింది.

ఎప్పుడెలా స్పందించాలో…?

వామపక్షవాదిగా ముద్ర పడ్డ ప్రొ.నాగేశ్వర్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలుస్తారు, కానీ ప్రయత్నం మీద కూడా పార్టీ సానుభూతిపరులైన పారిశ్రామికవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఒకోసారి కలువలేని పరిస్థితులుంటాయి. ఆర్.కృష్ణయ్య రాజకీయ నేపథ్యం చిత్రంగా ఉంటుంది. 2014లో తెలుగుదేశం తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రచారం పొంది, ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అయిదేళ్లు ఏనాడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గనలేదని, పార్టీ కార్యాలయానికీ వచ్చేది కాదని టీడీపీ వారే అంటారు. 2018 కాంగ్రెస్ అభ్యర్ధిగా మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కాంగ్రెస్లో ఉన్న సంగతి అప్పట్లో చాలా మంది కాంగ్రెస్ వారికే తెలియదు. ఇక 2022లో వైఎస్సార్సీపీ తరపున ఏపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. అంతర్గతంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు, ఉన్నట్టుండి బీజేపీ తరపున, ఏపీ నుంచి తిరిగి రాజ్యసభకు ఎన్నికయారు. టీడీపీ -జనసేనలతో బీజేపీకి అక్కడ పొత్తుండటం వల్ల వారికో ఎంపీ స్థానం లభించింది. కానీ, ఎంపీ అయ్యాక ఆయనను పిలిచి పార్టీ సత్కరించడమో, ఆయనే స్వయంగా పార్టీ కార్యాలయానికి (ఏపీలోగాని, తెలంగాణలో గానీ) వచ్చి కృతజ్ఞతలు చెప్పడమో… వంటి మర్యాదలేవీ జరుగలేదని బీజేపీవాదులే వాపోతుంటారు. పైగా, కర్కోటకుడు, కరడుగట్టిన నేరస్థుడు నయీమ్ను మెచ్చుకోవడమే కాక, తనకు రూ. 200 కోట్లు ఇస్తానన్నాడని, తనని పార్టీ పెట్టమన్నాడనీ కృష్ణయ్య చెప్పారు. అతని వల్ల ఓట్లు వచ్చాయా? వైఎస్సార్సీపీయే ప్రకటించుకున్నట్టు ఆర్.కృష్ణయ్యకు ఎంపీ సీటివ్వడం వల్ల బీసీలంతా ఆ పార్టీ వైపు మొగ్గి ఉంటే, అసెంబ్లీ ఎన్నికల్లో వారికి అంతటి దయనీయ ఫలితాలు (11/175) ఎందుకు వస్తాయనే లాజిక్ను బీజేపీ కేంద్ర నాయకులు ఆలోచించారో, లేదో? తెలియదు. అమలుపరిచే వరకు కేంద్ర నాయకత్వ ఆలోచన ఏపీ బీజేపీ నాయకులకు తెలిసినట్టు లేదు. తెలంగాణలో పార్టీని గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలకు చెప్పి, కారణాలే చెప్పా పెట్టకుండా, ఎన్నికల ముందు ఉన్నట్టుండి బీసీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ను ఎందుకు తప్పించారో అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.

ఎవరికి వారే…..

తెలంగాణ బీజేపీలో ఎన్ని సొబగులు ఉన్నా… నాయకుల మధ్య సయోధ్య లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు, చాన్నాళ్లుగా బీజేపీలో ఉన్న పాత తరానికీ మధ్య స్పర్ధ ఉంది. ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య, వారిలో వారికి కూడా పెద్దగా సఖ్యత లేదంటారు. జంటనగరాల ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ‘తానొక దుర్గం, తనదొక మార్గం’ అన్నట్టు విడిగానే వ్యవహరిస్తారు. ఎంపీలు ఈటల రాజేందర్, డి.అర్వింద్, డీ.కే. అరుణ, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు లలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందనే చర్చ నిరంతరాయంగా సాగుతూనే ఉంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో దాదాపు 35వేల బూత్ కమిటీలకు గాను 22 వేల కమిటీలు ఏర్పడ్డాయి, మిగతావి ఏర్పడుతున్నాయి. మండల కమిటీల ఏర్పాటు పూర్తయింది. జిల్లా కమిటీలు ఏర్పడాల్సి ఉంది. రాష్ట్ర కమిటీకి ఎన్నికలు నిర్వహిస్తారా? ఢిల్లీ నాయకత్వమే నియమిస్తుందా? తేలాల్సిన అంశం. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి తిరిగి అధ్యక్షుడు కావాలని ఉందని, అందుకే ఆయన పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారని పార్టీలోనే ప్రత్యర్థులైన వారు ఢిల్లీ వరకు మోశారు. అది తెలిసి ఢిల్లీ నేతలు ఆగ్రహంగా ఉన్నారనే సమాచారంతోనే ‘రాష్ట్రాధ్యక్ష పదవికి నేను పోటీలో లేను’ అని బండి స్వయంగా మీడియా ద్వారా ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చిందనే ప్రచారముంది. పార్టీ నాయకుల మధ్య సఖ్యత లోపించడం వల్లే ఎన్నికల ముందు అత్యవసరంగా నాయకత్వాన్ని మార్చాల్సి వచ్చిందని స్వయంగా ప్రధాని ఒక ఆంతరంగిక సమాచారంలో వెల్లడించే వరకు, ఆ మార్పు ఎందుకు జరిగిందనేది మిస్టరీయే! అప్పట్లో ఆయన జరిపిన పాదయాత్ర (నాలుగు విడతల)ను అధికారికంగా ముగించలేదు. ఎందుకు అనుమతించారో? ఎందుకు ఆపేయమన్నారో…? హేతుబద్దంగా ఎందుకు ముగించలేదో కూడా ఎవరికీ తెలియదు. వివాదాస్పదమైన ‘పుష్ప’ వ్యవహారంలో… హీరో అర్జున్ను నెత్తిన పెట్టుకొని, అవసరానికి మించి రాష్ట్ర నాయకత్వం స్పందించిన తీరుకు అధిష్టానం అనుమతి ఉందా? అన్నది పార్టీ శ్రేణుల్లోనే సందేహం!

మునుగోడు కొంప ముంచింది..

పాలక బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చి, హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలిచే వరకు శ్రేణుల్లోనే కాక పార్టీలోనూ మంచి ఊపు ఉండింది. సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్`గజ్వేల్ రెండు చోట్ల నుంచి ఆయన ఓడిపోయినా…. మల్కాజిగిరి నుంచి లోక్సభకు గెలవటంతో మళ్లీ ఊపొచ్చింది. కానీ, తానాశించిన రాష్ట్రాధ్యక్ష పదవికి పార్టీలోని పాతతరం నుంచి ప్రతిఘటన ఎదురవడంతో మళ్లీ డీలా పడ్డారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెరుగైన స్థితి, హుజూ రాబాద్ ఉప ఎన్నిక, తర్వాతి వరంగల్ తదితర కార్పొరషన్ ఎన్నికలు…. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా బీజేపీ గెలుపు బాటలో సాగుతున్న తరుణంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ముంచుకు వచ్చింది. ‘వచ్చింది’ అనే కంటే ‘తెచ్చుకున్నారు’ అనడబే సబబేమో! సరైన అధ్యయనం, తగిన అంచనా లేకుండా చేజేతులా కొని తెచ్చుకున్న ‘తొందరపాటు చర్య’లా, బీజేపీని నిలువునా ముంచిన ఉప ఎన్నిక అది! వరుసగా మూడు ఎన్నికల్లో పార్టీ ఓడుతున్న స్థానమది. 2014లో టీడీపీతో పొత్తుల్లో పార్టీ నాయకుడు మనోహర్రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీలో చేరకముందే ఆయనని అభ్యర్థిగ ప్రకటించి, నియోజకవర్గంలో, ఎన్నికల సభలో కండువా కప్పారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కని ఆ ఎన్నికలో.. పాలకపక్షం చేతిలో ఓటమి బీజేపీకి పెద్ద షాక్! అప్పటివరకున్న ఊపు తుస్సుమంది. బీజేపీలో చేరాలా కాంగ్రెస్లోనా… అని అప్పటిదాకా ఊగిసలాటలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటి ఎందరో నాయకులు, ఈ ఫలితంతో బీజేపీ పై ఆశలు వదులుకొని కాంగ్రెస్లో చేరిపోయారు. చివరకు మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి కూడా కాంగ్రెస్లోకే వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా తటస్థ ఓటర్లు కూడా అటే మొగ్గడంతో మునుగోడు చేదు అనుభవపు ప్రతికూల ప్రభావం, 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ అవకాశాలను తుడిపేసింది. ఒక రకంగా రాష్ట్రంలో బీజేపీ పతనానికి మునుగోడు ఓటమి నాందీ వాచకమైంది.

అయోమయంలో అధిష్టానం..

అధికారంలోకి వస్తామనుకున్న తెలంగాణలో పరిణామాలు, ముఖ్యంగా సంస్థాగత అంశాలు బీజేపీ అధిష్టానానికి మింగుడుపడటం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇటీవల భేటీ అయిన ప్రధాని మందలించింది ఇందుకే! విషయాలన్నీ తెలుస్తున్నా… ఏమీ చేయలేని అచేతన స్థితి! పార్టీ నాయకుల మధ్య నెలకొన్న అనారోగ్యకర స్పర్థకు ఆరెస్సెఎస్ స్థానిక నాయకత్వమూ విసిగిపోయినట్టు సమాచారం. వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోకపోవడం, దీన్దయాల్ ఉపాధ్యాయ చెప్పినట్టు ‘పాత-కొత్త నాయకులు కలిసి నడవాల్సిందే’ అనే వాస్తవికతను జీర్ణించుకోకపోవడమే కారణమన్న భావన ఉంది. కేంద్రంలో అధికారం ఉండి, ఆర్థిక వనరులకూ కొదువ లేక, ఎనిమిదేసి మంది ఎంపీలు-ఎమ్మెల్యేల బలముండి… ప్రజాక్షేత్రంలో ముందడుగు పడటం లేదు. అందుకే, పార్టీ కేంద్ర నాయకత్వం అయోమయంలో పడి తలపట్టుకుంటోంది. ఏం చేస్తున్నామో తెలియని స్థితికి వారి నిర్ణయాలే నిదర్శనం!

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

Optimized by Optimole