పాలకుల్లో స్పందించే మనస్తత్వం లేనప్పుడు ఎన్ని సీట్లు తెచ్చుకున్నా ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రభుత్వాలు కొత్తగా వ్యాపారాలు.. ఉపాధి అవకాశాలు సృష్టించకపోయినా ఉన్నవాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు, సంక్షేమ పథకాల విషయంలో చేతి వృత్తులను కులాల వారీగా విడగొట్టి పేదలకు లబ్ధి పొందకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. హస్త కళాకారుల జీవితాలకు భరోసా లేకుండా చేసింది వైసీపీ పాలకులేని మనోహర్ తేల్చిచెప్పారు.
వైసీపీ ప్రభుత్వం స్వర్ణకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు మనోహర్. జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వర్ణకారుల కోసం చక్కటి పాలసీలు తీసుకొస్తుందని హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన జీవో కాపీలు స్వయంగా తీసుకువచ్చి స్వర్ణకారులకు అందచేస్తానని పవన్ కళ్యాణ్ తరఫున మాటిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం తెనాలి షరాఫ్ బజార్ లో స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనోహర్ పాల్గొన్నారు. ప్రతి దుకాణానికి తిరిగి స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు శ్రీ మనోహర్ గారి చేతుల మీదుగా పార్టీ క్రియాశీలక సభ్యత్వం స్వీకరించారు. “చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేందుకు ముందుకు వచ్చిన యువతకు ప్రభుత్వాలు అండగా నిలబడాలని సూచించారు. స్వర్ణకారుల సమస్యల మీద వైసీపీ ప్రభుత్వం నుంచి స్పందన కరవయ్యిందని మనోహర్ వాపోయారు.