politics: హీరో ఎవరో..? జీరో ఎవరో..? ప్రజలే తేలుస్తారు..!

politics: హీరో ఎవరో..? జీరో ఎవరో..? ప్రజలే తేలుస్తారు..!

Telugustatespolitics:

తగలబడిన తన ఇంటిని చక్కదిద్దుకోకుండా పక్క వారి ఇల్లు ఎలా తగలబడిరదా అని విచారించే వివేకి చందంగా ఉంది బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీరు. తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా తిరస్కరణకు గురైన బీఆర్‌ఎస్‌ తమ వైఫల్యాలను విశ్లేషించుకొని, పార్టీని చక్కదిద్దుకోవాల్సి ఉంది. దానికి బదులు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఎలా ఓడిపోయింది అని బాధపడుతున్నట్టు ఉంది ఆయన వ్యవహారం. ఈ రెండు పార్టీలు ఒకే రకమైన తప్పులు చేసి.. ఒకే రకమైన ఫలితాలు పొందాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఒంటెత్తు పోకడలతో పరిపాలిస్తే ఇక్కడైనా, అక్కడైనా, ఎక్కడైనా ప్రజాగ్రహానికి గురికాక తప్పదనే గుణపాఠం అన్ని పార్టీలకు నేర్పించాయి రెండు తెలుగు రాష్ట్రాల ఫలితాలు.


తీహార్‌ జైలులో ఉన్న తన చెల్లి కవితను పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడుతూ..

‘‘ఏపీలో ఫలితాలను ఊచించలేదు. సంక్షేమ పథకాలను అమలు చేసిన వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మళ్లీ గెలుస్తాడని అనుకున్నాం..జగన్‌ ఓడిపోయినా వైఎస్‌ఆర్‌సీపీ దాదాపు 40 శాతం ఓట్లు సాధించింది…. ఆయనను ఓడిరచేందుకు షర్మిలను వాడుకున్నారు.. జగన్‌ హీరో… షర్మిల జీరో  ’’

అంటూ వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సీపీలు తమ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, రెండు పార్టీల అధినేతల వ్యవహార శైలి ఆ పార్టీల ఓటమికి ప్రధాన కారణాలని లోకం కోడయి కూస్తోంది. ఈ వాస్తవాలను విస్మరించిన రెండు పార్టీలు ప్రజల కోసం సంక్షేమాల పథకాలు బోలెడు తీసుకొచ్చినా ఓటర్లు మమ్మల్ని ఓడిరచారని మదనపడుతున్నాయి.


వైఎస్‌ఆర్‌సీపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒకరికి ఒకరు అన్ని విధాలా సహకరించుకున్న ఉదంతాలు పలు ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్‌ ప్రకటనతో ఇది వాస్తమని నిరూపితమైంది. వైఎస్‌.జగన్‌తో విభేదించి, సొంతంగా రాజకీయంగా ఎదగాలనే లక్ష్యంతో ఆయన సోదరి షర్మిలా తల్లి విజయమ్మ అండతో తెలంగాణలో పార్టీ స్థాపిస్తే కేసీఆర్‌ సర్కార్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇబ్బందులకు గురిచేసిన ఘటనలున్నాయి. ఆమె చేపట్టిన యాత్రలపై బీఆర్‌ఎస్‌ దాడులు చేస్తే, కేసీఆర్‌ ప్రభుత్వం అరెస్టులు చేసింది. ఈ చర్యలను అన్ని వర్గాలు ఖండిరచినా అన్నగారైన జగన్‌ స్పందించలేదు. తమ మిత్రుడైన జగన్‌ కళ్ళలో ఆనందం చూడడానికే తెలంగాణలో షర్మిలను అడుగడుగునా అడ్డుకున్నారని ఇప్పుడు కేటీఆర్‌ చేసిన ప్రకటన తేటతెల్లం చేస్తోంది.


షర్మిల ఉందతమే కాకుండా గతంలో రెండు రాష్ట్రాల మధ్య పలుమార్లు రేగిన సెంటిమెంట్‌ ఉద్రిక్తతలు కూడా ఈ రెండు సర్కారుల చలవే అనేది బహిరంగ రహస్యమే. ఉదాహరణకు 2023 అసెంబ్లీ ఎన్నికల చివరిలో ఉరిమిపడ్డట్టు నాగార్జునసాగర్‌ వద్ద ఏర్పడిన ఉద్రిక్తతనే చెప్పవచ్చు. ఈ ఘటనలో ఏపీ పోలీసులు నాగార్జునసాగర్‌ వద్ద కొన్ని గేట్లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారంటూ, దీనికి బదులుగా తెలంగాణ పోలీసులు కూడా అక్కడ బలగాలను మోహరించడం రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడమే. ముందస్తు ఎలాంటి ఘటనలు, ఉద్రిక్తతలు లేని నాగార్జున సాగర్‌ వద్ద ఏదో గందరగోళ వాతావరణాన్ని కల్పించి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు సాయపడాలని జగన్‌ సర్కారు భావించింది. ఎన్నికలు ముగియగానే రెండు రోజుల ఈ నాటకీయ పరిణామాలకు తెరపడడమే ఈ పార్టీల తెరచాటు రాజకీయాలకు నిదర్శనం. ఇలా సాయపడ్డ జగన్‌ ఊహించని రీతిలో ఓడిపోవడంతో కేటీఆర్‌ కలత చెందినట్టున్నారు.


ఈ రెండు పార్టీలు ఒకరికొకరు సాయపడడమే కాదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వీరు తీసుకున్న కొన్ని పాలక నిర్ణయాలు కూడా ఒకే కోవలో ఉన్నట్టు కనిపిస్తాయి. కేసీఆర్‌ సర్కారు హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, జగన్‌ సర్కార్‌ కూడా విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్‌ వినియోగంలో ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి నూతన సచివాలయ భవనాన్ని నిర్మిస్తే, జగన్‌ అమరావతి కాదని విశాఖ రాజధాని అంటూ అక్కడ భవనాలు, ప్యాలెస్‌లు నిర్మించారు. వీరిద్దరూ భవనాలు, విగ్రహాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఉద్యోగ కల్పనకు ఇవ్వకపోవడంతో యువత ఈ సర్కార్‌ను గద్దెదింపడంలో కీలక పాత్ర పోషించింది.


ఉద్యోగ నియామకాల వైఫల్యంతో నిరుద్యోగుల్లోనే కాకుండా వీరి పాలనలో రెండు రాష్ట్రాల ఉద్యోగుల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉండేది. సమయానికి జీతాలు చెల్లించకపోవడం, ఉద్యోగుల బదిలీల్లో కావాల్సిన వారికే ప్రాధాన్యతివ్వడం, సీపీఎస్‌ అమలులో దాటవేత వైఖరి ప్రభుత్వ ఉద్యోగుల్లో నిరాశను నింపింది. అంతేకాక తెలంగాణలో కేసీఆర్‌ తన విధేయులను ఎంపిక చేసుకొని ఉన్నత పోస్టుల్లో కూర్చుబెట్టడంతో అధికారం అంతా వారి కనుసన్నుల్లోనే సాగింది. ఏపీలో కూడా జగన్మోహన్‌రెడ్డి కీలక పోస్టులను తనవారికే కట్టబెట్టడంతో పెత్తనం అంతా వారిదే. రెండు రాష్ట్రాల్లోనూ ఇలాంటి అధికారుల పోకడలతో కిందిస్థాయి ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్ప‌డింది.

రాజ్యాలు పోయినా కేసీఆర్‌, జగన్‌ పాలన రాచరిక పోకడలతోనే సాగింది. కోటల్లాంటి అధికారిక నివాస గృహలకే పరిమితమైన వీరిని కలవడం వారి భజనపరుల కోటరీకే సాధ్యమయ్యేది. మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ బడా నేతలకు కూడా వీరి దర్శనం ఒక అరుదైన మనో బాగ్యం అయ్యింది. ఇక సాధారణ ప్రజల బాధలు వర్ణనాతీతం. రాజులకు తగ్గట్టే వారి నాయకుల వ్యవహార శైలీ కూడా ఉండేది. ఈ ప్రభుత్వాల హయాంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా తామేమి తక్కువ కాదంటూ కొంది వారెవరికీ అందుబాటులో ఉండేది కాదు. అంతేకాక ఎవరి స్థాయిలో వారు నియోజకవర్గాలు మొదలు కొని రాష్ట్రస్థాయి వరకు వీరి అవినీతి దందాలకు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది. ఇష్టానుసారంగా అధికారులకు పోస్టులు ఇప్పించుకొని అక్రమంగా సంపాదించారు. పోలీసుల అండతో ప్రత్యర్థులను పలు రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఒకరిని చూసి ఒకరు అనుసరించారా అన్నట్టు ఈ అంశాలలో బీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సీపీ సర్కారులకు ఎన్నో పోలికలున్నాయి.

సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చాక కూడా రెండు ప్రభుత్వాలు ప్రతిపక్షాలపై కక్షగట్టినట్టే వ్యవహరించాయి. తమకు ఎదురు లేకుండా ఉండాలనే లక్ష్యంగా, ప్రతిపక్షాల ఉనికే లేకుండా చేయడానికి ప్రయత్నించాయి. తెలంగాణలో కేసీఆర్‌ భారీ మెజార్టీ సాధించినా ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేలా ముకుమ్ముడిగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ అవసరం లేకపోయినా తెలుగు దేశం ఎమ్మెల్యేలను నైతిక విలువలు లేకుండా చేర్చుకున్నారు. లిక్కర్‌ స్కాం మరక రెండు పార్టీలకు అంటుకుంది. కేసీఆర్‌ కూతురు కవిత ఇప్పటికీ జైలులోనే ఉండగా, వైసీపీ బడా నేతలు అప్రూవర్‌గా మారి బయట తిరుగుతున్నారు. దీనికి అదనంగా జగన్‌కు బాబాయి వైఎస్‌. వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో సమీప బంధువు అవినాశ్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలతో ఆయన సొంత కుటుంబంలో తుఫాను ఏర్ప‌డింది.


తెలంగాణ తెచ్చిన పార్టీగా రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురై, ఐదు నెలల వ్యవధిలో వచ్చిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మరింత ఘోరంగా సున్నాకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఐదు నెలల సమయం ఉన్నా ఏమాత్రం కోలుకోలేక, లోక్‌సభ ఎన్నికల్లో మరింత ఘోరంగా చతికిలబడిరది. దీంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీపై నమ్మకం సడలి పక్కచూపులు చూస్తున్న వేళ కేటీఆర్‌ పార్టీ బాగోగులు, భవిష్యత్‌పై దృష్టి పెట్టాల్సింది పోయి ఇతర రాష్ట్రాల ఫలితాలపై విశ్లేషించడం హాస్యాస్పదమనే భావన సామన్యుల్లో ఉంది.

వైఎస్‌ఆర్‌సీపీకి దాదాపు 40 శాతం ఓట్లు రావడాన్ని కేటీఆర్‌ గొప్పగా చెప్పారు. 2019 ఎన్నికల్లో దాదాపు 50 శాతం ఓట్లు పొందిన ఆ పార్టీ ఇప్పుడు 10 శాతం ఓట్లు కోల్పోయింది. ఇటు బీఆర్‌ఎస్‌ కూడా 2018 ఎన్నికల్లో సగటున దాదాపు 47 శాతం ఓట్లు పొంది, 2023 ఎన్నికల్లో 37 శాతం ఓట్లు పొందింది. అంటే బీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సీపీ రెండు పార్టీలు దాదాపు పది శాతం ఓట్లు కోల్పోయి అధికారాన్ని జేజార్చుకున్నాయి. ఎన్నికల్లో పది శాతం ఓట్లు కోల్పోవడం తీవ్ర ప్రజావ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పవచ్చు. దీన్ని కప్పిపుచ్చుతూ వైఎస్‌ఆర్‌సీపీ 40 శాతం ఓట్లు పొందిందని కితాబు ఇవ్వడం కేటీఆర్‌కే చెల్లింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన షర్మిలను జీరో అన్న కేటీఆర్‌ ఎంతో రాజకీయ అనుభవమున్న బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో జీరోకే పరిమితం కావడాన్ని ఎలా సమర్థించుకుంటారు..? ప్రస్తుత ఓటమి స్పీడ్‌ బ్రేకర్‌లాంటిదని, తాము మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోపక్క కళ్లు మూసుకొని తెరిస్తే ఐదేళ్లు కాలం గడిచిపోతుందని, మళ్లీ మనదే అధికారమనే భరోసాతో జగన్‌ ఉన్నారు. వీరి ఆశలు అడియాసలు కాకుండా ఉండాలంటే ఇరు పార్టీల్లో ఆత్మపరిశీలన అవసరం.

ఒకరికొకరు సహకరించుకోవడమే కాక పలు పరిపాలనా నిర్ణయాల్లో ఒకే రకమైన విధానాలు అనుసరించిన వైఎస్‌ఆర్‌సీపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రజావ్యతిరేకత చవిచూశాయి. నిరంకుశధోరణి, అవినీతి, దౌర్జన్యాలు, కోటరీ, కోటలు వంటి సారుప్యాలతో ఎన్నికల రాజకీయాల్లో తగిన మూల్యం చెల్లించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గతంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు అవే తప్పులు చేశాయి… అదే ఫలితం పొందాయి. ప్రజా తీర్పుతో మట్టి కరిచిన ఈ రెండు పార్టీలు వాస్తవాలను గ్రహించి ఆత్మవిమర్శ చేసుకోకపోతే చివరన.. హీరో ఎవరో..? జీరో ఎవరో..? ప్రజలే తేలుస్తారు.

========================


`ఐ.వి.మురళీ కృష్ణ శర్మ
పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ