హైదరాబాద్: రాష్ట్రంలో ఆషాఢ మాసంతో పాటు బోనాల ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.భక్తి, శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖంగా, శాంతిగా, ఆయురోగ్యంతో జీవించాలన్నారు.
ఇక తల్లి దీవెనలతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక: సీఎం రేవంత్
బోనాల ఉత్సవాలు ప్రారంభం సందర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలతో రాష్ట్రంలో పండుగ వాతావరణం మొదలవుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాక్షించారు. చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఆషాడ మాసం తొలి బోనం సమర్పించడంతో జంటనగరాల్లో బోనాల సందడి నెలకొంటుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరు సుఖ శాంతులతో, ఆయురోగ్యాలతో జీవించాలని రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించే దిశగా తల్లి దీవెనలు ఉండాలని సిఎం ఆకాంక్షించారు. జంట నగరాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు బోనాల ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల సదుపాయాల కోసం 20 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.