ఈశాన్య రాష్ట్రాల పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ రిపోర్టు.. ఎక్స్ క్లూజివ్ ..!

ఈశాన్య రాష్ట్రాల పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ రిపోర్టు.. ఎక్స్ క్లూజివ్ ..!

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలను పీపుల్స్ పల్స్ సంస్థ ప్రకటించింది. సర్వే ఫలితాలను సంస్థ డైరెక్టర్ దీలిప్ రెడ్డి సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఇక సర్వే రిపోర్టు ప్ర‌కారం ..త్రిపురలో అధికార పగ్గాలు చేపట్టాలంటే 31 సీట్లు రావాల్సి ఉండగా.. అధికార బీజేపీకి 18 నుంచి 26 సీట్లు, సీపీఐ(ఎం) ఇతర లెఫ్ట్ పార్టీలకు 14 నుంచి 22, తిప్రా మోతా పార్టీకి 11 నుంచి 16 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 1 నుంచి 3 సీట్లు, ఐపీఎఫ్టీ పార్టీకి ఒక సీటు ఇతరులకు ఒకటి నుంచి రెండు సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు తేలింది. ఎగ్జిట్ పోల్ ప్రకారం ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు కనపడటం లేదు.

కాగా త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ అవతరించే అవకాశాలు ఉన్నట్లు తేలింది. ఈ సారి ప్రభుత్వ ఏర్పాటులో నూతనంగా ఏర్పడిన తిప్రా మోతా పార్టీ ‘కింగ్ మేకర్ ’ రోల్ ప్లే చేయనున్నట్లు పీపుల్స్ పల్స్ రిపోర్టు చెబుతుంది. తిప్రా మోతా ఎవరికి మద్దతు ఇస్తే, వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాష్ట్రంలో 25 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న సీపీఐ( ఎం) ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తున్నా… అనుకున్న ఫలితాలు మాత్రం రావనే చెప్పవచ్చు.


మరో రాష్ట్రం మేఘాలయలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్పీపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఎన్పీపీ కి 17 నుంచి 26 సీట్లు, టీఎంసీకి 10 నుంచి 14, బీజేపీకి 3 నుంచి 8, కాంగ్రెస్ కి 3 నుంచి 5, ఇతరులు 4 నుంచి 9 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలంటే 31 సీట్లు రావాల్సి ఉండగా.. ఏ పార్టీ సొంతంగా అధికారంలో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం కుదిరే పొత్తే మేఘాలయలో అధికార పీఠాన్ని నిర్ణయిస్తుంది.


అటు నాగలాండ్ లో అధికారంలో ఉన్న ఎన్డీపీపీ పార్టీకి 20 నుంచి 27, బీజేపీ కి 14 నుంచి 21, ఎల్ జెపీకి 5 నుంచి 10 సీట్లు, ఎన్పీఎఫ్ కి 3 నుంచి 8, కాంగ్రెస్ కి 2 నుంచి 4, ఇతరులకు 2 నుంచి 4 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే రిపోర్ట్ లో వెల్లడైంది. ఇక్కడ అధికార పీఠం దక్కించుకోవాలంటే 31 సీట్లు రావాల్సి ఉండగా.. ఎన్డీపీపీ, బీజేపీ కలిసి వరసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నిరుద్యోగం, అవినీతి, అభివృద్ధిలేమి వంటి సవాళ్లను ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీపీపీ ప్రభుత్వం అధిగమించలేకపోయినట్లు సర్వేలో తేలింది.

బీజేపీ కి కలిసొచ్చిన అంశాలు…(త్రిపుర)

• త్రిపురలో గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్న బీజేపీ చెప్పుకోదగ్గ విజయాలేమీ సాధించకపోయినప్పటికీ, శాంతి భద్రతల్ని చక్కబెట్టడం ఆ పార్టీకి కలిసొచ్చింది.
• బీజేపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం వల్ల ఏర్పడిన ప్రజా వ్యతిరేకత సీపీఎంకి కలిసి వచ్చింది.
• నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మానిక్ సర్కార్ సహా మరికొంతమంది సీనియర్లు ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం సీపీఎంకి ప్రతికూలంగా మారింది .
• ప్రాంతీయ పార్టీ తిప్రా మోతా ఈ సారి ఆదివాసీ ఓటర్లను గంపగుత్తగా తన వైపు తిప్పుకోవడంతో ‘కింగ్ మేకర్’ గా అవతరించే అవకాశం ఏర్పడింది.

మేఘాలయ
• మేఘాలయలో నిరుద్యోగం, అవినీతి, అక్రమ బొగ్గు గనుల తవ్వకాలు, మౌలిక సదుపాయాల లేమికి సంబంధించి ప్రస్తుతం అధికారంలో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.

• మేఘాలయలో గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి కోనరాడ్ సంగ్మా కుటుంబ పాలన అనే ట్యాగ్ మోస్తుండటం కూడా ఎన్పీపీకి ప్రతికూలంగా మారింది.

• మేఘాలయలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్పీపీ పార్టీల కలిసి పోటీ చేసి అధికారాన్ని పంచుకోగా, ఈ సారి ఇరు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి.

• మేఘాలయలో 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకున్నా… వారిలో అత్యధికులను మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా తన వెంట టీఎంసీలోకి తీసుకెళ్లడంతో ఈ సారి టీఎంసీ బలం పెరిగింది.

• క్రిస్టయన్ జనాభా ఎక్కువగా ఉండే మేఘాలయలో బీజేపీకి యాంటీ క్రిస్టియన్ పార్టీగా ముద్రపడటం ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది.

నాగాలాండ్..

• నాగాలాండ్ లో నిరుద్యోగం, అవినీతి, అభివృద్ధిలేమి వంటి సవాళ్లను ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీపీపీ, బీజేపీ కూటమి అధిగమించలేకపోయింది.
• ప్రభుత్వ ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యమిచ్చే ప్రజలున్న రాష్ట్రంగా పేరుపొందిన నాగాలాండ్ లో గత 5 ఏళ్లలో ఎన్డీపీపీ ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేపోయింది.
• ఈశాన్య రాష్ట్రాల్లో కేవలం నాగాలాండ్ లోనే కనీస రోడ్డు సదుపాయలు లేకపోవడం పట్ల అధికార ఎన్డీపీపీ, బీజేపీ కూటమి విమర్శలు ఎదుర్కొంటోంది.
• నాగాలాండ్ లో బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఎన్డీపీపీ, బీజేపీ కూటమికి కలిసి వచ్చింది.