Nancharaiah merugumala senior journalist:
ప్రస్తుతం బతికున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఏకైక మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజనతోనే రాజకీయంగా మరణించిన కిరణ్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మాజీ క్రికెటర్ గానే గుర్తుండి పోయారు. టీమ్ లేకుండానే బ్యాట్ పట్టిన గొప్ప స్కిపర్ కిరణ్. రాజమండ్రి, బెజవాడ మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ వంటి గొప్ప రాజకీయ విదూషకులతో ఆసక్తికర నాటకాలాడించారు కిరణ్ రెడ్డి. జిత్తులమారులైన ఆంధ్టోళ్లను పెద్ద మొద్దు దద్దమ్మలుగా మార్చిన సుదీర్ఘ నాటకంలో చివరి అంకం…2014 అసెంబ్లీ ఎన్నికల ముందు రాజమహేంద్రవరంలో జై సమైక్యాంధ్ర పార్టీని ఉండవల్లి వంటి హేమాహేమీలైన రాజకీయ పండితులు సమక్షంలో ప్రారంభించడం. ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల హౌజింగ్ సొసైటీ ఆఫీస్ బేరర్ గా ప్రభుత్వ స్థలం కొద్దిగా నల్లారి కిరణ్ ఆక్రమించారని 2004-2009 మధ్యలో ఈనాడులో వార్త వచ్చింది. ఈ వార్తలోని ఆరోపణను ఖండిస్తూ మీడియా ముందు కిరణ్ రెడ్డి ఏడ్చిన ఏడుపు ఇంకా జనానికి గుర్తుంది.