Elections: ‘‘ఒక దేశం- ఒక ఎన్నిక’’పై.. ఒక మాట..!

Elections: ‘‘ఒక దేశం- ఒక ఎన్నిక’’పై.. ఒక మాట..!

OneNation- one election:

‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత లక్షణమే కాదు, విలక్షణ సంపద అని పలుమార్లు రుజువైంది. ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఉద్వేగ నినాదంగా బాగున్నంత, ఆచరణ గొప్పగా ఉంటుందనే నమ్మకం లేదు. ఇందులో పలు సమస్యలున్నాయి. దేశంలో రావాల్సిన ఎన్నికల సంస్కరణల్లో ఇదంత ప్రాధాన్యతాంశమేం కాదు! అంతకన్నా ప్రాధాన్యతగల అంశాలెన్నో దిక్కూ-దివాణం లేక ప్రజాస్వామ్యమే వెనుకడుగులోకి జారుతోంది. ముందా సంస్కరణలు ముఖ్యం. పదేళ్ల బీజేపీ, ‘తరచూ వాదనలు మార్చే’ (షిఫ్టింగ్ న్యరేటివ్స్) ఒరవడిలో భాగంగా వస్తున్నదే తప్ప, ఇప్పటికిప్పుడు చట్టం తెచ్చి ‘జమిలి ఎన్నికలు’ జరుపుకోవడం అత్యవసరమేంకాదు, దాని వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. జమిలితో.. అభివృద్దికుండే ఆటంకాలు తొలగిపోతాయి, సమయం, ఆర్థిక-మానవ వనరుల దుబారా తగ్గుతుందనేది ఓ ఆశ! కానీ, ప్రాంతీయ అస్తిత్వాలకు అదొక గొడ్డలిపెట్టు, సమాఖ్య స్ఫూర్తికి భంగకరం, ప్రజాస్వామ్య పంథా వీడి అధ్యక్షతరహా పాలనవైపు అడుగులు పడే ప్రమాదముందన్న భయాలూ తొంగిచూస్తున్నాయ్.

కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగానే… దేశమంతటా ఒకేసారి (జమిలి) ఎన్నికలు జరిపించే విషయంలో సమగ్ర చర్చ జరగాలి. శాసనసభల స్పీకర్లతో పాటు మేధావులు, సమాజంలోని విభిన్నవర్గాల ప్రతినిధుల్ని భాగంచేసి చర్చించాలి. ఇందుకుద్దేశించిన రెండు బిల్లుల ముసాయిదాను, ప్రతిపాదిత అంశాలను పార్లమెంటు సంయుక్త సంఘాని (జేపీసీ)కి పంపి, మంచి-చెడుల బేరీజు తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. బిల్లులను తెస్తున్నంత ఆదరా బాదరగా కాకుండా పార్లమెంటు ఉభయసభల్లో లోతైన చర్చ జరగాలి. ఈ విషయంలో తొలినుంచీ రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. వారి వాదనల్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్రవేశపెట్టినా.. బిల్లులు ఎలగూ వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఓటింగ్కు వస్తాయి. అవకాశం ఉంది కనుక, జేపీసీలో లోతుగా చర్చించి, రెండు సభల్లోనూ ఉభయపక్షాల వాదనలు విని ఒక నిర్ణయానికి రావాలి. మందబలంతో బుల్డోజ్ చేసే పద్దతి పాటించొద్దు. ఎందుకంటే, నిస్వార్థమైన సేవాతత్పరత, అపార పరిజ్ఞానమున్న ఎందరో మేధావులు సుదీర్ఘంగా చర్చించి, ఆమోదించిన రాజ్యాంగపు పలు కీలకాంశాలను ఉన్నట్టుండి మార్చాల్సి వస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు మరో మూడు చట్టాల్లోని అంశాలు, రాజ్యాంగంలోని ఆరు అధికరణాల్లో 18 చోట్ల సవరణలు తేవాలి. మార్పుల తర్వాత రాగల పరిణామాలను సరిగా అంచనావేయకుండా. అదరాబాదరాగా రాజ్యాంగాన్ని సవరించి కూర్చుంటే సమస్య జఠిలమౌతుంది. పరిస్థితి పెనమ్మీంచి పొయ్యిలో పడ్డట్టయ్యే ప్రమాదముంది.

అప్పటి పరిస్థితి వేరు…

జమిలి ఎన్నికల బిల్లులు కేంద్ర మంత్రివర్గ సమావేశపు ఎజెండాలో ముందు లేవు. ‘ఒకదేశం ఒక ఎన్నిక’ ప్రతిపాదన బిల్లు, జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగపు సవరణ బిల్లుల ముసాయిదాంశాలు వ్యూహాత్మకంగా, అప్పటికప్పుడు క్యాబినెట్ ముందుకు వచ్చాయి. వాటిని క్యాబినెట్ గురువారం ఆమోదించింది. ఈ భేటీల్లోనే ఉభయసభల్లో ప్రవేశపెడతారు. ‘బిజినెస్ జాబితా’లో శుక్రవారం వెల్లడించిన లోక్సభ సచివాలయం, ఆదివారం నాటి జాబితా నుంచి వాటిని తొలగించింది. వివిధ పక్షాలతో సంప్రదింపుల వెసలుబాటుకోసం అలా చేశారేమో తప్ప మీడియాలో వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వపు ఊగిసలాట కాదు, వెనుకడుగే లేదు. ఇప్పుడు బిల్లుల్ని ప్రవేశపెట్టినా… చర్చ, ఓటింగ్ వచ్చే సమావేశాల్లోనే! ఈ లోపు బిల్లుల ముసాయిదాలను జేపీసీకి సిఫారసు చేయొచ్చు. జేపీసీలో, తర్వాత సభా చర్చల్లో భిన్నాభిప్రాయాలకు ఆస్కారముంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సంప్రదింపుల్లో 32 పార్టీలు సానుకూలంగా మాట్లాడి, మద్దతు ప్రకటిస్తే 15 పార్టీలు పూర్తిగా వ్యతిరేకించాయి. వ్యతిరేకిస్తున్న పార్టీల్లో కాంగ్రెస్ ఉండటంతో… 1952 నుంచి 1967 వరకు, వరుస నాలుగు ఎన్నికల్లో కేంద్రం-రాష్ట్రాల ఎన్నికల్ని కలిపి (జమిలి) నిర్వహించినపుడు, మరిప్పుడెందుకు సాధ్యపడదు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అనే ప్రశ్న పాలకపక్షాలు లేవనెత్తుతున్నాయి. స్వాతంత్రం వచ్చాక జరిగిన తొలి సభలు కావడంతో అది సాధ్యమైంది. తర్వాత ఎన్నో మార్పులొచ్చాయి. భాషాప్రాతిపధికన రాష్ట్రాల విభజన జరిగింది. అవిశ్వాసాల్లో కొన్ని సభలు అర్దాంతరంగా ముగిశాయి. కొన్ని ప్రభుత్వాలు కూలిపోయో, రాష్ట్రపతి పాలన విధింపుతోనో ఎన్నికల ద్వారా కొత్త సభలు ఏర్పడ్డాయి….. ఇలా వేర్వేరు పరిణామాల వల్ల లోక్సభకు, వివిధ శాసనసభలకు ఎన్నికల గడువు కాలాలు మారుతూ వచ్చాయి. భారత ఎన్నికల సంఘానికున్న విచక్షణాధికార పరిధి, వెసలుబాటు వల్ల… అప్పటికి రద్దయిన, రాష్ట్రపతిపాలనలో ఉన్న రాష్ట్రాల సభల ఎన్నికల కాలాలు స్వల్పంగా అటిటు అవుతూ వచ్చాయి. అందుకే, 1970ల తర్వాత జమిలి సాధ్యపడలేదు. ‘జమలి కొత్తేం కాదు, ఇదివరకు జరిగిందే’ అని అమిత్షా అంటున్నా, ఇవాల్టి పరిస్థితి వేరు. అదంత సాధారణమే అయితే, ఇపుడు చట్టాలను, రాజ్యాంగాన్నీ మార్చడమెందుకు?

బలవంతం అప్రజాస్వామికమే!

అన్ని ఎన్నికల్ని ఒక తేదీకి లాగే క్రమంలో… ఎన్నో మార్పులు చేయాల్సి ఉంటుంది. మొదట, పొట్టికాలం నిడివి సభలు, పొడుగుకాలం నిడివి సభలు అనివార్యమవుతాయి. బలవంతపు రాష్ట్రపతి పాలనలూ ఉంటాయేమో? ఇప్పుడు ప్రతిపాదిస్తున్నట్టు 2027లోనో, మరెపుడో జమిలి ఎన్నికల్ని నిర్వహించాక కూడా… ఏ కారణం చేతైనా ఒక రాష్ట్ర అసెంబ్లీ రద్దయితే, తిరిగి ఎన్నికల ద్వారా ఏర్పడే కొత్త సభను ఆ మిగిలిపోయిన కాలానికే పరిమితం చేస్తారు. సభ రద్దయిన సమయాన్ని (నాలుగేళ్లకో, మూడేళ్లకో రద్దయింది అనుకుంటే) బట్టి కొత్త సభకు ఏడాదో, రెండేళ్లో మిగలచ్చు. సాధారణ ఎన్నికల్లో జరిగినట్టే అన్ని నియోజకవర్గాల, అందరు ఓటర్ల నిర్ణయంతో జరిగే మధ్యంతర ఎన్నికలో గెలిచిన సభ్యుల కొత్తసభ అలా ఆరుమాసాలకో, ఏడాదికో పరిమితం కావాల్సి రావడం ఏ రాజ్యాంగ`ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక? అది డబ్బు-మానవ వనరుల దుబారా కాదా? అనే ప్రశ్న సహజం. దీనికి, రాజకీయ పార్టీలు ఎలా అంగీకరిస్తాయో చూడాలి. చాలా దేశాల్లో దేశవ్యాప్త ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికలు వేటికవిగానే జరుగుతాయి. జమిలి జరిపే ఏడెనిమది దేశాల్లో అధ్యక్ష తరహా పాలనకిది సానుకూలమే! జమిలి ఎన్నికల నిర్వహణా ఒక సంక్లిష్టమే! మొన్నటి హర్యానా ఎన్నికలతో, గడువు సమీపించిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్ని ఎందుకు కలపటం లేదు? అని అడిగితే, ‘… శాంతిభద్రతలు, నిర్వహణ పరంగా ఇబ్బందులుంటాయ’ని ఎన్నికల సంఘం పేర్కొంది. నాలుగయిదు రాష్ట్రాల్లోనే కలిపి ఎన్నికలు నిర్వహించలేని వారు మొత్తం దేశవ్యాప్తంగా లోక్సభకు దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ని కలిపి, రేపెప్పుడో స్థానిక సంస్థల ఎన్నికల్నీ కలిపి ‘మహా జమిలి’ ఎలా నిర్వహిస్తారు? అనే ప్రశ్న సహజం.

సంస్కరణల సవాళ్లెన్నో…?

భారీ ఓటర్ల భాగస్వామ్యంతో భారత ఎన్నికల నిర్వహణ ప్రపంచంలోనే ఒక అబ్బురం! బ్యాలెట్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం) లకు మారిన తర్వాత కూడా, అభివృద్ది చెందిన దేశాలు విస్మయం చెందే స్థాయిలో మన ‘మహా ఎన్నికలు’ జరుగుతున్నాయి. విడతలుగా జరిగిన ఎన్నికల సంస్కరణలు ప్రక్రియను చాలా వరకు పారద్శకం చేశాయి. స్వేచ్ఛగా-స్వతంత్రగా ఓటర్లు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నప్పటికీ…. ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రక్రియలో లోపిస్తున్న జవాబుదారితనం ఆందోళన కలిగిస్తున్నాయి. ‘‘దేశ ఎన్నికల ప్రక్రియలో ముదురుతున్న ‘క్యాష్ క్యాన్సర్’ను నియంత్రించే సంస్కరణ అత్యవసరంగా రావాలి’’ అని సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయి ఇటీవల హైదరాబాద్లో చేసిన వ్యాఖ్య కీలకమైంది. ‘మునుగోడు’ అసెంబ్లీ ఉప ఎన్నికలో మనం కళ్లారా చూశాం. సరిగ్గా పోలింగ్కు ముందు లక్షల ఓట్లు గల్లంతయినా, నిన్న మహారాష్ట్రలో జరిగినట్టు ఒకటి, రెండు నెలల్లోనే లక్షలాది కొత్త ఓట్లు నమోదైనా…. ఎన్నికల సంఘం నుంచి సరైన వివరణ, జవాబుదారితనం లేకపోవడం దారుణం. ఈ సంస్కరణలు చేపట్టకుండా ‘జమిలి’కి పట్టుబట్టడం సరికాదనే అభిప్రాయం కొన్ని పార్టీల వారు, మేధావులు వ్యక్తంచేస్తున్నారు. విడిగా ప్రజాప్రతినిధులు గానీ, స్థూలంగా పార్టీలు గానీ, ప్రభుత్వాలు గానీ ఆశించిన/నిర్దేశించిన స్థాయిలో పనిచేయకుంటే వారిని వెనక్కి రప్పించే (కాల్బ్యాక్) పద్దతి ఉండాలనే డిమాండ్ పెరుగుతున్న తరుణంలో.. అయిదేళ్లకొకమారు అన్ని ఎన్నికలూ జరిపేయాలి, మధ్యలో ఏ ఎన్నికలూ ఉండొద్దనే నిర్బంధమేమిటనే వాదన ఒకటుంది. మధ్యలో వేర్వేరు ఎన్నికలుంటేనే నాయకులైనా, పార్టీలైనా, ప్రభుత్వాలైనా కొద్దో గొప్పో భయంతో ఉంటాయనేది సాధారణ అభిప్రాయం. అందుకు, ఎన్నో సాక్ష్యాలు, తర్కాణాలు మన కళ్లముందే ఉన్నాయి. కాన్షీరామ్ అన్నట్టు ‘ఏటా ఎన్నికలుండాలి’ అనే వాదనను బలపరచకపోయినా… ఎన్నికల భయం ఉన్నపుడే ప్రభుత్వాలు ప్రజానుకూలంగా నడుచుకోవడం తరచూ జరిగేదే! అలా కాకుండా, ఒకసారి ‘జమిలి’ జరిగితే, ఇక అయిదేళ్లూ ఏ ఎన్నికలుండవంటే… ప్రభుత్వాల ఏకస్వామ్యమే సాగుతుందనే భయాలున్నాయి. పైగా, భిన్నత్వ ప్రతీక అయిన దేశంలోని ప్రాంతీయ అస్తిత్వాలు, భావనలు, వాదనలు… ‘జమిలి’లో ఆధిపత్యం వహించే జాతీయ ప్రవాహంలో కొట్టుకుపోతాయనే ఆందోళన కూడా ఉంది. అందుకే, ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

ఒక పార్టీ-ఒకనాయకుడంటారేమో!

ఉభయ సభల్లో ఎన్డీయేకున్నది బటాబోటీ మెజారిటీ! మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే తప్ప సాధ్యపడని రాజ్యాంగ సవరణలకు ఎలా సాహసిస్తున్నారనేది ప్రశ్న! రాజ్యసభలో 164/243 అవసరమైనచోట 122 (42 తక్కువ) సంఖ్యాబలమే ఉంది. లోక్సభలో 361/542 (ఒక ఖాళీ) అవసరం కాగా ఉన్నది 293 (63 కొరత) మాత్రమే! ఆరోజు సభకు హాజరైన వారిలో మూడింట రెండొంతులు చాలు కనుక… ప్రత్యర్థి పార్టీల నుంచి క్రాస్ఓటింగ్, గైర్హాజరీలను ప్రోత్సహిస్తారా? అని, విపక్షంలో భయ-సందేహాలున్నాయి. తరచూ ఎన్నికల వల్ల కోడ్ అమలు అభివృద్దికి ఆటంకమనే భావనే తప్పని, ఓట్ల యావతో ఎన్నికలకు నెలల ముందే అభివృద్ది పనులు చేయడం కాకుండా అయిదేళ్లపాటు జరిపితే కోడ్కు వెరవాల్సిన భయమేమిటని ప్రశ్నిస్తున్నారు.

‘జమిలి’పై ఎందుకీ పంతం…?’ ఇదే పంథాలో సాగి. రేపు ‘ఒక పార్టీ, ఒకే నాయకుడ’నే నినాదంతో ప్రజాస్వామ్యాన్ని అధ్యక్షతరహా పాలనవైపు నడిపే ప్రమాదాన్ని మొగ్గలోనే తుంచేయాలన్నది వ్యతిరేకవాదన వినిపించే వారి మాట!