Telangana: సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం..!

Telanganacongress:

తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు 2025 ఫిబ్రవరి 4వ తేదీ చారిత్రాత్మక దినోత్సవం. జనాభాలో సగానికిపైగా ఉన్నా అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్న బీసీలకు సరైన న్యాయం చేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో ముందడుగు వేసింది. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ప్రాధాన్యతివ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ ఎన్నికల ముందే కార్యాచరణ రూపొందించి 2023 నవంబర్ 10వ తేదీన కామారెడ్డిలో ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించి, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు కృషి చేస్తోంది. వెనుకబడిన కులాలకు సరైన న్యాయం జరగాలనే లక్ష్యంతో కులగణన చేపట్టి, పూర్తి చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

సమాజంలో అసమానతలు తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ సముచిత నిర్ణయాన్ని తొలిసారిగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతగా గర్విస్తున్నాను. బీసీల అభివృద్ధి కోసం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రధాన అంశంగా ప్రతిపాదించిన కులగణనను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి తమది బడుగు బలహీన వర్గాల పక్షపాతి ప్రభుత్వమని కాంగ్రెస్ మరోసారి నిరూపించుకుంది. రాష్ట్రంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2025 ఫిబ్రవరి 4వ తేదీన కీలకమైన సామాజిక ప్రక్రియలను చట్టసభల వేదికగా పూర్తి చేసింది. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే నివేదికతో పాటు ఎస్సీల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికను కూడా ఆమోదించిన మంత్రివర్గం, కాలయాపన చేయకుండా అదే రోజు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడంతో పాటు, వాటిని ఆమోదించి బడుగు బలహీన వర్గాల సంక్షేమంపై తమకున్న నిబద్ధతను నిరూపించుకుంది. ఈ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా పాటిద్దామని ఇచ్చిన పిలుపు స్వాగతించాల్సిన అంశం. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా కులగణను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి తీర్మానాలు చేయడం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచింది.

వెనుకబడిన బలహీన వర్గాలకు సమన్యాయం జరిగి వారి హక్కులు వారికి లభించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే దేశంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. స్వతంత్ర భారతదేశంలో కులగణన చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది. కులగణన సర్వేకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు రూ.160 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. అధికారికంగా 2024 ఫిబ్రవరి 4వ తేదీన సర్వే ప్రక్రియ ప్రారంభించి 2025 ఫిబ్రవరి 4వ తేదీని పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో 2024 నవంబర్ 6వ తేదీన సర్వే మొదలుపెట్టి 2024 డిసెంబర్ 25తో పూర్తి చేసింది. 3.70 కోట్ల జనాభా గల తెలంగాణలో 3.54 కోట్ల మంది వద్ద శాస్త్రీయ పద్దతిలో సమాచారం సేకరించింది. సర్వేలో ఎలాంటి గందరగోళం లేకుండా ఒక్కో యూనిట్ 150 ఇళ్లను పరిశీలించింది. ఇందుకు 1.03 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ సేవలను అందించారు. వీరికి అదనంగా 76 వేల మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా పని చేయడంతో అందరి కృషితో చారిత్రాత్మక ఘట్టం విజయవంతంగా పూర్తయ్యింది.
ప్రజలకిచ్చిన వాగ్దానాలపై మడమ తిప్పని కాంగ్రెస్ ఒక్కో హామీని పూర్తి చేస్తుండడంతో తాము ఉనికి కోల్పోతామనే భయంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. 95 శాతంపైగా సర్వే పూర్తయ్యిందని ప్రభుత్వం లెక్కలతో సహా ప్రకటిస్తున్నా సర్వేను అసంపూర్తిగా ముగించారని విమర్శించడం వారి అజ్ఞానానికి నిదర్శనం. రాష్ట్రంలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు 1,15,71,457 కాగా వాటిలో 1,12,15,134 కుటుంబాల సర్వే జరిగిందంటే 96.9 శాతం పూర్తయ్యినట్టే. పలు కారణాలతో సర్వే చేయని కుటుంబాల సంఖ్య 3,56,323 మాత్రమే. ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో అభద్రతాభావాన్ని కలిగిస్తున్నారు.
దేశంలో గతంలో ప్రతి పదేళ్లకు జనాభా లెక్కల్ని సేకరించేవారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక జనాభా లెక్కలకు బ్రేక్ పడింది. దీంతో అధికారిక లెక్కలు లేకపోవడంతో ప్రధానంగా బడుగు బలహీన వర్గాల వారు హక్కులు కోల్పోతున్నారు. జనాభా లెక్కలు చేపట్టాలని, అందులో భాగంగా కులగణన కూడా నిర్వహించాలని కాంగ్రెస్ పార్లమెంట్ వేదికగా ఎన్ని విన్నపాలు చేసినా సామాజిక న్యాయం పట్టని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దేశ వ్యాప్తంగా కులగణన కోసం బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తేలేని రాష్ట్ర బీజేపీ నేతలు సామాజిక న్యాయం చేస్తున్న కాంగ్రెస్పై విమర్శలు చేయడం దురదృష్టకరం. దేశంలో కులగణనపై బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో స్పష్టం చేయనంత వరకు ఆ పార్టీకి కాంగ్రెస్పై వ్యాఖ్యలు చేసే అర్హతే ఏదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో హడావుడి చేస్తూ, ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినా అధికారికంగా ఆ నివేదికను బయట పెట్టలేదు. తమ రాజకీయ స్వార్థానికి ఆ సర్వే నివేదికను ఉపయోగించుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తప్పుడు లెక్కలతో సోషల్ మీడియాలో సమగ్ర కుటుంబ సర్వే నివేదిక అంటూ వైరల్ చేయడం వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే భావితరాలకు ఒక దిక్సూచిలా, మార్గదర్శకంగా నిలవడం ఖాయం.
కాంగ్రెస్పై బీఆర్ఎస్ తప్పుడు గణాంకాలతో చేస్తున్న ఆరోపణలు హాస్వాస్పదంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్న లెక్కల్లో బీసీల జనాభా 1,85,61,856 మంది అంటే 51 శాతమే. ఇప్పుడు తాజా కులగణన లెక్కల ప్రకారం ముస్లింలలో ఉన్న బీసీలను కూడా కలుపుకొని రాష్ట్రంలో మొత్తం బీసీల సంఖ్య 1,99,85,767 అంటే 56.33 శాతమని తేలింది. అంటే బీసీల జనాభా తగ్గిందా, పెరిగిందా అనేది పాఠశాల ప్రైమరీ విద్యార్థులను అడిగినా చెబుతారు. ముస్లింలలో ఉన్న ఓసీలను కూడా కలుపుకుంటే ఓసీలు మొత్తం 15.79 శాతం, ఎస్సీలు 17.43, ఎస్టీలు 10.45 శాతం ఉన్నారని కులగణన లెక్కలు స్పష్టం చేస్తున్నా, ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలతో అర్థరహితంగా ప్రకటనలను చేయడం ప్రజలను పక్కదారి పట్టించడమే.

జనాభా ప్రాతిపదికన ఎవరెంత ఉన్నారో, వారికంత న్యాయం జరిగేలా కులగణన పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 23 శాతం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అయితే దీనికి రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉన్న నేపథ్యంలో, రాజ్యాంగ సవరణ పేరుతో కాలయాప చేస్తూ బీసీలకు అన్యాయం చేయడం కన్నా తొలుత పార్టీ తరఫున బీసీలకు 42 శాతం టికెట్లు ఇచ్చి బీసీలకు సమన్యాయం చేసేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. గతంలో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 23 శాతానికి తగ్గించిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ 42 శాతం టికెట్లు బీసీలకు ఇస్తామన్నా, విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది.
పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలి ఏడాదిలోనే బీసీల సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకొని అమలు చేసింది. బీసీ సంక్షేమానికి 2024-25 బడ్జెట్లో రూ.9200.32 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ఏర్పాటైన అనతికాలంలోనే తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి సభ్యులను నియమించింది. పలు బీసీ కులాల సహకార సంఘాలను ఏర్పాటు చేసింది. బీసీ కార్పొరేషన్కు 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.73 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు రూ.400 కోట్లు, బీసీ కులాల కార్పొరేషన్, ఫెడరేషన్లకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్లు చొప్పున కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభివృద్ధిపై తమకున్న నిబద్దతను నిరూపించుకుంది. సావిత్రిబాయి ఫూలే జయంతి జనవరి 3న తెలంగాణలో అధికారికంగా మహిళా టీచర్ల దినోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
బీసీల సంక్షేమానికి బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్న కాంగ్రెస్, వారిని రాజకీయంగా కూడా ప్రోత్సహించేందుకు ఎంత కృషి చేస్తుందో చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు పార్టీలో అత్యున్నతమైన టీపీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడమే. జనాభాలో సగానికిపైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి కులగణన చేపట్టి పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలతో అవాకులు చెవాకులు పేలితే ప్రజలు వారికి సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికలను ఆమోదించి దేశానికే ఆదర్శంగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం తమతోనే సాధ్యమని మరోసారి నిరూపించుకుంది.

Optimized by Optimole