Telanganapolitics: తెలంగాణాలో ఆసక్తికర రాజకీయ నడుస్తోంది. ప్రధాన పార్టీలైనా బీఆర్ఎస్ ,కాంగ్రెస్ బిజెపి అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల లిస్టు వచ్చేస్తోందని మీడియా చానళ్లు ఊదరగొట్టేస్తున్నాయి. దీనికి తోడు అధికార బిఆర్ఎస్ 30 మేర సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలలో సీటు వస్తుందా? రాదా? అన్న గూబులు మొదలైంది. మరోవైపు పార్టీ టికెట్ ఆశించిన ఆశావాహులు.. కాంగ్రెస్ పార్టీ ఓవర్ లోడ్ అవడంతో బిజెపి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
అటు బిజెపి ,కాంగ్రెస్ పార్టీలలో సైతం టికెట్ల అంశం అధిష్టానాలకు కత్తి మీద సాములా తయారైంది. అధికార పార్టీ సీట్ల కేటాయింపు పై ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇవ్వడంతో కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నేతలతో టచ్ లో ఉన్నారు. టికెట్ల సంగతి అలా ఉంచితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు బీఆర్ఎస్ పార్టీ పెద్ద మైనస్ అన్న ప్రచారం జరుగుతుంది. గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తమకంటూ ఓ వర్గాన్ని ఏర్పరచుకున్నారు. ఒకవేళ టికెట్ రాని పక్షంలో వీరంతా ఎమ్మెల్యేల వెంట నడిస్తే కారు పార్టీకి డ్యామేజ్ జరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.