×

నృసింహ జయంతి అంటే ఏమిటి..? ఎందుకు ఈ వేడుకను జరుపుకుంటారు..?

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్

నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుర్నమామ్యహమ్

విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహస్వామి. నృసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం, తల సింహం రూపంలో అవతరించిన దేవుడు.నృసింహస్వామి మాహా శక్తి వంతమైన దేవుడు. ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నృసింహ జయంతిని వేడుకగా జరుపుకొంటారు.

నరసింహ జయంతి వృత్తాంతం..

హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే “శ్రీ” పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.

పురాణ చరిత్ర..
కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతయైన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు.

అనంతరం రాజ్యపాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందర గిరికి పోయి ఘోరమైన తపసు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయ్యింది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవ,దానవ,మనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధములచేగాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు.

అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు. ఇంక వర గర్వంతో హిరణ్యకశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. పంచ భూతాలను నిర్బంధించాడు. తపములను భంగ పరచాడు. సాధులను హింసింప సాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు “కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టినవాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును” – అని వారికి అభయమిచ్చాడు. హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదనుచూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షస రాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని అప్పగించాడు.

ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వ భూతములందు సమ భావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కుల గురువులైన చండామార్కుల కప్పగించాడు. ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి – నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు “సర్వము అతని దివ్య కళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు” అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడుహిరణ్య కశిపుడు మండి పడ్డాడు.

తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాద కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.

క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి – నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు. అయితే “ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?” అని రాజు ప్రశ్నించాడు.

“బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్” అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. “సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?” అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.

నరసింహావతారం ..

బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి.

ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, ………. కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు” స్తంభమునుండి ఆవిర్భవించాడు.

ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో ( గోళ్లతో )చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి ( మనిషీ , జంతువూ కాక) నారసింహుని రూపంలో ( పగలు, రాత్రి కాని ) సంధ్యాకాలంలో ( ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని ) గోళ్ళతో ( ఇంటా బయటా కాక ) గుమ్మంలో ( భూమిపైనా, ఆకాశంలో కాక ) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.

నృసింహస్తుతి..

నృసింహ జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా ‘ఓం నమో నారసింహాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు పెద్దలు.

‘నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్‌’ అంటూ నృసింహ గాయత్రిని జపిస్తూ ఉన్నా ఎటువంటి అనారోగ్యం, ఆపదల నుంచైనా విముక్తి లభిస్తుందట.

‘ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌
నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం’ అనే మంత్రాన్ని పఠించినా మృత్యువు సైతం ఆమడదూరంలో నిలిచిపోతుందని నమ్మకం.

లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం

పక్షీంద్రశైలభవనం భవనాశమీశం

గోక్షీరసార ఘనసార పటీరవర్ణం

వందే కృపానిధిం అహోబలనారసింహం

ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం

అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం

వందే కృపానిధిం అహోబలనారసింహం

కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం

కేయూరహారమణికుండల మండితాంగం

చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం

వందేకృపానిధిం అహోబలనారసింహం

వరాహవామననృసింహసుభాగ్యమీశం

క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం

హంసాత్మకం పరమహంసమనోవిహారం

వందేకృపానిధిం అహోబలనారసింహం

మందాకినీ జననహేతుపదారవిందం

వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం

మందారపుష్పతులసీరచితాన్ఘ్రిపద్మం

వందే కృపానిధిం అహోబలనారసింహం

తారుణ్యకృష్ణతులసీదళదామరాభ్యాం

దాత్రీరమాభిరమణం మహనీయరూపం

మంత్రాదిరాజ మతదానవమానభంగం

వందేకృపానిధిం అహోబలనారసింహం

ఈ శుభదినాన్ని మనమందరం నృసింహజయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. మనం భగవంతుడికి పండ్లు, పూలు, దక్షిణ తాంబూలాలను భక్తితో సమర్పించుకోవాలి. మనం ఎంత సమర్పించాము, ఏమి సమర్పించాము అనే లౌకికమైన భావనలకంటే ముఖ్యమైనది మన హృదయాంజలి. మనసా, వాచా, కర్మణా స్వామికి ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదనను మించిన పూజ లేదు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

ఆత్మ ప్రయాణం: మరణానంతరం 13 రోజుల ఆధ్యాత్మిక యాత్ర

Devotional: సనాతన ధర్మం ప్రకారం మరణం అంతం కాదు. అది ఒక దశ ముగింపు… మరో దశకు ఆరంభం.మనిషి శరీరం నశించినా, ఆత్మ నశించదు. తన కర్మల భారంతో, ఆశయాలతో...

Read out all

Karthikamasam: కార్తిక మాసంలో 360 వత్తులు వెలిగించడం ఎందుకు ప్రత్యేకం…?

Karthikadeepam: హిందూ సంప్రదాయంలో దీపదానం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రత్యేకంగా కార్తికమాసం లో దీపాలను వెలిగించడం అఖండ పుణ్యఫలాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 360 వత్తులు వెలిగించడం...

Read out all

kumarswamy: సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు కారణం..?

Kumarswamy: ఆషాఢమాసంలో స్కందపంచమి, కుమారషష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో వచ్చే కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.దీనికి తోడు కుమార షష్ఠి రోజే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారని...

Read out all

Varanasi: కాశీ వారాహీ అమ్మవారిని రాత్రి పూటనే ఎందుకు దర్శిస్తారు..?

Devotional:వారణాసి ఆధ్యాత్మిక నిలయంగా ప్రసిద్ధి. ఈ పవిత్ర నగరంలో ఎన్నో మహిమాన్విత దేవాలయాలున్నాయి. కానీ వాటిలోనూ భూగర్భంలో ఉన్న ఒక అద్భుత ఆలయం – ఉగ్ర వారాహీ అమ్మవారి మందిరం....

Read out all

Varahi Navratri: వారాహీ నవరాత్రుల ప్రత్యేకత..!

VarahiNavratri: ఆదిశక్తి అనుగ్రహం కోసం భక్తులు ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. అలాంటి తపస్సుకి శ్రేష్ఠ సమయంగా భావించబడే వారాహీ నవరాత్రులు ఈ జూన్ 26న ప్రారంభమవుతున్నాయి. భూదేవి సంరక్షణ కోసం...

Read out all

Ashadam: ఆషాఢం – ఆధ్యాత్మికతకు మూలం..!

Ashadamasam: చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల మధ్య సంచరించటం వలన దీనికి ‘ఆషాఢం’ అనే పేరు వచ్చింది. అయితే దీనినే శూన్య మాసం అని కూడా పిలుస్తారు....

Read out all
Optimized by Optimole