కర్ణాటక: తమకూరు జిల్లా తిపటూరు మండలంలోని కడశెట్టిహళ్లి గ్రామ శివారులో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య సుమంగళి అతన్ని నిద్రలోనే అత్యంత దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. సుమంగళి, శంకరమూర్తి అనే దంపతులు గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్లో నివసిస్తున్నారు. అదే గ్రామంలోని బాలికల హాస్టల్లో వంటమనిషిగా పనిచేస్తున్న సుమంగళి, నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది.
ఈ నేపథ్యంలో తమ అక్రమ సంబంధానికి భర్తను అడ్డుగా భావించిన సుమంగళి… కళ్లలో కారం పొడి చల్లింది. అనంతరం కర్రతో విచక్షణరహితంగా దాడి చేసి, చివరికి గొంతుపై కాలు మోపి ప్రాణాలు తీసింది.
తర్వాత ప్రియుడి సహకారంతో మృతదేహాన్ని సంచిలో కుట్టి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని బావిలో విసిరేశారు. అంతటితో ఆగని సుమంగళి… భర్త కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
కానీ ఫామ్ హౌస్ను పరిశీలించిన పోలీసులు అక్కడ కారం పొడి గల గుర్తులను గుర్తించారు. విచారణలో క్రమంగా గుట్టు రట్టు అయ్యింది. చివరికి సుమంగళి తానే హత్య చేసినట్టు అంగీకరించడంతో ఆమెతో పాటు ప్రియుడు నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు.