Bandisanjay: బండి సంజయ్ తొలి విడత ‘ ప్రజాహిత’ యాత్ర సక్సెస్..

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలిదశ ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిపల్లి వద్ద ప్రారంభించిన ప్రజాహిత యాత్ర ఈరోజు మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారంలో ముగిసింది. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఈ యాత్ర కొనసాగింది. మొత్తం 81 గ్రామాల్లో ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. జగిత్యాల జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాల్లోనూ ప్రజాహిత యాత్రను పూర్తి చేశారు. ప్రతి గ్రామంలో, మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో బండి సంజయ్ పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాకు చేసిన అభివ్రుద్ధిని, వెచ్చించిన నిధులను పూర్తి వివరాలతో సహా ప్రజలకు వివరించారు. ఆయా గ్రామాల్లోనూ వీటికి సంబంధించి నిధుల వివరాలతో పోస్టర్లను అంటించారు. 

మరోవైపు సిరిసిల్ల జిల్లాలో ప్రజాహిత యాత్రకు అడగుడగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏ గ్రామానికి వెళ్లినా స్థానికులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రజాహిత యాత్ర ఆద్యంతం కాషాయ సైన్యం బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ వెంట కదిలింది. బండి సంజయ్ యాత్రలో భాగంగా  గడప గడపకు తిరుగుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామాల వారీగా వెచ్చించిన నిధులను లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. ప్రజల కష్టాలను స్వయంగా అడిగితెలుసుకున్నారు. వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా సంజయ్ కు తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని..మరోసారి ఎంపిగా తనను గెలిపించాలని సంజయ్ అభ్యర్ధించారు. పువ్వుకు ఓటేస్తే రాముడికి వేసినట్లే..500 ఏళ్ల నాటి కల నెరవేర్చిన మోదీని మళ్లీ ప్రధానిని చేద్దామని సంజయ్ పిలుపునిచ్చారు.  

ఇక రాజకీయ అంశాల విషయానికొస్తే ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్.. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం, క్రిష్ణా నీటి వాటాల విషయంలో రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని అడుగడుగునా ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వ్రుధా చేసిన కేసీఆర్ సహా బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని, వారి ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదో అడుగడుగునా నిలదీశారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వైఫల్యాలను సైతం పదేపదే ఎండగట్టారు.