INCTELANGANA:
బీసీల అభివృద్ధి కోసం పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రకటన విడుదల చేశారు. కవిత ధర్నా చేపట్టబోయే ముందు తాను సంధించిన ప్రశ్నలకు
జవాబు చెప్పాలని సవాల్ విసిరారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో బీసీలను వంచించడమే కాకుండా.. వారికి న్యాయంగా అందాల్సిన నిధులను ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం బీసీలపై కపట ప్రేమ చూపుతూ మొసలికన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. బీసీలకు మేలు కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమని తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ బీసీలకు గొంతు కోసింది..
గత స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీలకు గొంతు కోసిందని ప్రకటనలో టీపీసీసీ చీఫ్ నిప్పులు చెరిగారు. లిక్కర్ స్కాంలో మరకంటించుకున్న కవిత.. బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడం కోసం బీసీల పేరిట కపట నాటకం మొదలెట్టిందన్నారు . ఇందిరాపార్క్ వద్ద కవిత చేపట్టబోయే ధర్నాను.. విజ్ఞులైన బీసీలు గమనించి బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్లో బీసీలకు పెద్దపీట..
కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనం తనను తెలంగాణ అధ్యక్షులుగా నియమించడమేనని మహేష్ గౌడ్ గుర్తు చేశారు. అంతేకాక రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యతిచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని.. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బీసీ నేతను ఏర్పాటు చేయడం సాధ్యపడుతుందా..? అని సూటిగా ప్రశ్నించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా బీసీలకు ఎంత ప్రాధాన్యతిచ్చారో బహిరంగ రహస్యమేనని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో బీసీలను అడుగడుగున అణగదొక్కిన మీరు ఇప్పుడు బీసీ జపం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో..రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయోజనకరంగా ఉండేలా సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి ధర్నా చేపట్టడం దురదృష్టకరమని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవితకు ప్రకటనలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంధించిన ప్రశ్నలు..
1) కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 23 శాతం నుండి 42 శాతానికి పెంచడం కోసం చర్యలు తీసుకొని, అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా..?
2) బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిథ్యం లభించే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?
3) స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు చర్యలు చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారా..?
4) స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి గాను ప్రజా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?
5) జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?
6) గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్ను 2971.32 కోట్ల రూపాయలకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?
7) కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?
8) గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కార్మక్రమాన్ని ప్రారంభించినందుకు ధర్నా చేస్తున్నారా..?
9) బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?
10) ఎమ్బీసీ కార్పొరేషన్కు రూ.400 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?
11) మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో 5136 మంది ఉద్యోగులను నూతనంగా నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?
12) బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకు కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?
13) గురుకులాల్లో డైట్ కాస్మోటిక్ చార్జీలు 40 శాతానికి పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?
14) 28 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్స్ నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు ధర్నా చేస్తున్నారా..?
15) బీసీ కార్పొరేషన్ కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 73 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?