Janasena: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ ప్రజా సంఘాలు, పలువురు ప్రముఖులు, వ్యాపారస్తులు ముందుకొస్తున్నారు. మేము సైతం అంటూ మానవత్వం చాటుకుంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. విజయవాడ ప్రాంతానికి చెందిన డి.డి. రెమిడీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వరద బాధితుల సహాయార్ధం రూ.40 లక్షలు విలువ చేసే ఎమర్జెన్సీ మందుల కిట్లు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది.
మందులతో కూడిన మెడికల్ వ్యాన్ ను శనివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడలోని వైద్య శిబిరాల్లో ఈ కిట్లను అందుబాటులో ఉంచనున్నట్లు డిడి రెమిడీస్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, పార్టీ నేతలు మండలి రాజేష్, చోడిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.